telugudanam.co.in

      telugudanam.co.in

   

నందికేశ్వర వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒకనాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా నతడామె చేతులు కఠినముగ నున్నందున తన పాదములను పట్టవలదనెను. పార్వతి తన చేతులెందుకు కఠినముగ నున్నవో తెలుపవలసినదని యడుగగా హరుడామె పరోపకారము చేయకపోవుటచే నట్టి కాఠిన్యము హస్తములకు వచ్చెననియు, అవి మృదుత్వమునందుటకు నీళ్ళాటిరేవున వేడి నీళ్ళతో వచ్చుపోవువారికి తలంటి నీళ్ళు పోయవలయుననియు చెప్పెను. పార్వతి భర్త ఆఙ్ఞతో అట్లు చేయుచుండగా నొక పేదరాలు వచ్చి, ఆమెతో తలంటినీళ్ళు పోయించుకొని వెల్లుచుండగా ఆమెపై దయ తలచి పార్వతి సంపదనిచ్చెను. నాటి నుండి ఆ పేదరాలు ధనవంతురాలయి గుమ్మం లోకి వచ్చువారికి పని చెప్పుచుండెను. ఆ సంగతి పార్వతికి తెలిసి గర్విష్టురాలగు ఆమె భాగ్యమును తీసివేయుటకు విఘ్నేశ్వరుని పంపగా అతనికామె ఉండ్రాళ్ళ నైవేద్యము పెట్టెను. వాటిని తిని అతడు మరింత ఐశ్వర్యమామెకిచ్చి వెళ్ళిపోయెను. తరువాత పార్వతి నందిని పంపగా, నతనికి కామె సెనగలు వాయన మిచ్చుటచే, అతడు కూడా నామె భాగ్యములను తీయలేక పోయెను. తరువాత పార్వతి భైరవిని పంపగా నతనికామె గారెలు వండిపెట్టుటచే, నాతడు కూడా ఆమె భాగ్యములను తీయలేకపోయెను. పిమ్మట పార్వతి చంద్రుని పంపగా నతనికామె చలిమిడి చేసి పెట్టుటచే నతడునూ భాగ్యము హరింపలేకపోయెను. అటుపిమ్మట పార్వతి సూర్యుని పంపగా నాతనికామె క్షీరాన్నము వండి పెట్టెను. అందుచే నతడునూ భాగ్యమును హరింపలేకపోయెను. పిమ్మట అర్జునుని పంపగా, నామె అతనికి అప్పాలు నైవేద్యముగా పెట్టుట చేత భాగ్యము హరింపలేకపోయెను. పిమ్మట శివుని పంపగా నతని కామె చిమ్మిలి పెట్టగా నతడునూ భాగ్యము హరింపలేకపోయెను. తుదకు పార్వతి వెళ్ళగా, నామెకు పులగము నైవేద్యము పెట్టెను. అంత పార్వతి నామె భక్తికి మెచ్చి "నీవు మాకందరకునూ పెట్టిన తొమ్మిది పదార్ధములను వుద్యాపన చేసుకొన్న యెడల మానవులకు సకల సంపదలూ కలుగును" అని చెప్పి వెడలిపోయెను.

ఈ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొనవలెను.


దీనికి వుద్యాపనము

బిందెతో అయిదుమానికల అత్తెసరువేసి, దానికి అయిదుమూళ్ళ అంగవస్త్రమును చుట్టి, బంగారు నందిని నైవేద్యముగ పెట్టి బందువులకు వడ్డించవలెను.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: