telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

పప్పు పొంగలి

కావలసిన వస్తువులు:

బియ్యం - 250 గ్రా
పెసరపప్పు - 100 గ్రా.
పచ్చిమిర్చి (నిలువుగా కట్ చేసినవి) - 8.
ఆవాలు - 1/4 (పావు) టీ స్పూను.
జీలకర్ర - 1/4 (పావు) టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.
అల్లం - చిన్న ముక్క.
కరివేపాకు - 1 రెమ్మ.
కొత్తిమీర - 1 రెమ్మ.
ఖాజూ (జీడి పప్పు ) - సరిపడినంత.
మిరియాలు - కొద్దిగా.
నెయ్యి - సరిపడినంత.

తయారు చేసే విధానం:

బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని నీళ్ళలో పావుగంట నానబెట్టాలి. గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వరుసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళ్ళతో ఎసరు పెట్టాలి. ఎసరు పొంగు వచ్చాక పప్పు బియ్యం వేయాలి. సగం ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేసి కలపాలి. మొత్తం ఉడికిన తరువాత దించి, తరువాత జీడి పప్పు వేయించి అందులో కలపాలి, పైన కొత్తిమీర, మిరియాల పొడి చల్లితే బాగుంటుంది. ఇప్పుడు పప్పు పొంగలి సర్వ్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లే.


[ వెనుకకు ]

రాగి దోసె

కావలసిన వస్తువులు:

రాగిపిండి - 2 కప్పులు.
వేయించిన శనగపిండి - 1/2 (అర) కప్పు.
పుల్లటి పెరుగు - 1/2 (అర) కప్పు.
కొత్తిమీర తరిగినది - కొంచెం.
ఉప్పు - సరిపడినంత.
ఆవాలు - టీ స్పూను.
జీలకర్ర - చిటికెడు.
ఇంగువ, కరివేపాకు - సరిపడినంత.
నూనె - సరిపడినంత.
ఉల్లిపాయ - 1.

తయారు చేసే విధానం:

ముందుగా రాగిపిండిని రెండుగంటల పాటు నాననివ్వాలి. తర్వాత దీనికి శనగపిండి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కలపాలి. మరీ ముద్దగా ఉంటే సరిపడా నీళ్ళు పోసి జారుగా చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువతో పోపు వేసి ఈ పిండికి కలపాలి. తర్వాత దోసెలు వేసుకోవాలి.


[ వెనుకకు ]

సజ్జ బూరెలు

కావలసిన వస్తువులు:

సజ్జపిండి - 1 కిలో.
బెల్లం - 1/2 కిలో.
పచ్చికొబ్బరి తురుము - రెండు కప్పులు.
నూనె - వేయించడానికి.

తయారు చేసే విధానం:

సజ్జ పిండిలో బెల్లం పొడిగొట్టి వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లాస్టిక్ కవర్‌పై చేత్తో వత్తి నూనె వేడిచేసి అందులో వేసి వేయిస్తే, సజ్జ బూరెలు రెడీ! ఇదే విధంగా బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చు. అరిసెలు కష్టమనుకునే వారికి తేలికగా చేయగలిగే పిండి వంటకం బూరెలు!


[ వెనుకకు ]

ఫ్రైడ్‌రైస్

కావలసిన వస్తువులు:

అంగుళం సైజు కట్ చేసిన చిక్కుడుకాయ ముక్కలు - రెండు కప్పులు.
అన్నం - ఐదు కప్పులు.
చీల్చిన పచ్చిమిరపకాయలు - 8.
జీలకర్ర - ఒక టీస్పూన్.
అజీనామోటో - చిటికెడు.
సోయాసాస్ - ఒక టీ స్పూన్.
కరివేపాకు - 2 రెబ్బలు (సన్నగా తరగాలి).
ఉప్పు, నూనె - తగినంత.
చాట్ మసాలా - అర టీ స్పూన్.

తయారు చేసే విధానం:

ముందుగా చిక్కుడుకాయ ముక్కలను కాగిన నూనెలో వేగించి తీయాలి. తర్వాత మూకుడులో తగినంత నూనె వేసి కాగాక పచ్చిమిరపకాయముక్కలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత అందులో అజీనామోటో, చిక్కుడు ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. పొడిగా చేసిన అన్నం, సోయాసాస్ దానికి జతచేసి సన్నని మంటపై ఐదారు నిమిషాలు కలుపుతుండాలి. కొంతసేపైన తర్వాత అందులో చాట్‌మసాలా చల్లి మరో రెండు నిమిషాలపాటు స్టవ్ మీద ఉంచి గరిటెతో కలిపి దించాలి. వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ ఫ్రైడ్‌రైస్. ఇది చిక్కుడు కాయలతో చేసే ఫ్రైడ్‌రైస్. అలానే ఏ విధమైన కూరగాయలు ఉన్న దానితో ఫ్రైడ్‌రైస్ చేసుకోవచ్చు.


[ వెనుకకు ]

హల్వా (గుమ్మడికాయతో)

కావలసిన వస్తువులు:

తురిమిన గుమ్మడికాయ - 3 కప్పులు.
నెయ్యి - 3 చెంచాలు.
చక్కెర - 3 చెంచాలు (లేదా).
పాలపొడి - 1 చెంచా.
ఇలాచీ పొడి - 1/2 చెంచా.
కుంకుమ పువ్వు - 1/4 చెంచా.
చిన్నగా తరిగిన బాదం, పిస్తా పప్పులు - 1 చెంచా.
ద్రాక్షా - 1 చెంచా.

తయారు చేసే విధానం:

మందంగా మూకుడులో నెయ్యి వేసి వేడి చేయండి. దీంట్లో తురిమిన గుమ్మడికాయను వేసి, మూత పెట్టి చిన్న మంట మీద ఉడక నివ్వండి. కొద్దినిముషాల తరువాత మూత తీసి ఒక్కనిముషం అలా ఉంచి, మళ్ళీ మూతపెట్టి ఉడకనివ్వండి. గుమ్మడికాయ పూర్తిగా ఉడికి దాంట్లో నుండి నెయ్యి బయటికి వచ్చేవరకు అలాగే ఉంచాలి. తరువత దీనికి పాల పొడి, చెక్కర, ఇలాచీపొడి, కుంకుమపువ్వు కలిపి కొద్దిసేపు అలాగే మంటమీద ఉంచండి. దించిన తరువాతబాదం, పిస్తాతో అలంకరించి వేడిగా తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: