telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

మసాలాదోసె

కావలసిన వస్తువులు:

మినపప్పు - అర కేజి
బియ్యం - 1 కిలో.
నూనె - పావు కిలో
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు - తగినన్ని.
అల్లం ముక్క చిన్నది - 1.
బంగాళ దుంపలు - 100 గ్రా.
పచ్చిమిర్చి - 2.
కరివేపాకు - 1 రెబ్బ.
పోపుగింజలు - కొంచెం.

తయారు చేసే విధానం:

అంతా దోసెలు పద్దతే. (దోసెల్ని రేపొద్దున వేసుకోవాలి అంటే ఈ రోజు ఉదయమే పప్పు బియ్యం విడివిడిగా నానేయాలి. సాయంత్రం పప్పు మీద పొట్టుతీసేసి బియ్యం కూడా కలిపి మొత్తం మీద మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పువేసి విశాలమైన పాత్రలో ఉంచి మూతపెట్టాలి. మర్నాడు పొద్దునే స్టౌ వెలిగించడం పెనం కాల్చి నూనె వేసి ఈ పిండిని గరిట జారుగా కలిపి పల్చగా దోసెలు పోసుకోవాలి).

ఇందులోకి కాస్త మసాలా వేసుకోవాలి అంతే. ఉల్లి, మిర్చీ, అల్లం సన్నగా తరుక్కోవాలి. బంగాళ దుంపలు బాగా ఉడికించి తొక్కతీసి ముక్కలు ముక్కలుగా చదిమి పెట్టుకోవాలి. కాస్త నూనె మరిగించి పోపుముక్కలు వేయించి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిముక్కలు వేసి, అవి కూడా వేగినాక బంగాళ దుంప ముక్కలు వేసి కాస్త ఉప్పు, చిటికెడు పసుపు చల్లి కాసిన్ని నీళ్ళు పోసి మూత పెట్టాలి. 10 నిమిషాల్లో బాగా మగ్గితే కూర రెడీ అవుతుంది. ఈ మసాలా రెడీ అయ్యాక యదాప్రకారం దోసెపోసుకొని అది కాలాక ఓ గరిటెతో కూర ఆ దోసెమీద వేసి గరిటెతోనే గట్టిగా అదిమితే దోసెమీద పరుచుకుంటుంది. వెంటనే దోసె మడిచి తీసుకోవడమే.


[ వెనుకకు ]


రవ్వట్టు

కావలసిన వస్తువులు:

బొంబాయిరవ్వ - 25 గ్రా.
మైదా, బియ్యపు పిండి - 25 గ్రా.
నూనె - 100 గ్రా.
పచ్చిమిర్చి - 4.
జీలకర్ర - 2 చెంచాలు.
పుల్లనిమజ్జిగ - తగినంత.
ఉప్పు - తగినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.

తయారు చేసే విధానం:

రవ్వ, మైదా, బియ్యపు పిండి మజ్జిగలో (నీళ్ళలో) పోసి జారుగా కలిపి 1-2 గంటలు నాననివ్వాలి. అనంతరం సరిపడా ఉప్పు కలపాలి. పచ్చిమిర్చి సన్నగా చిన్నముక్కలుగా తరిగి కరివేపాకు జీలకర్రలతో కలిపి పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. పెనం కాలిన తరువాత, పిండిని అట్లుగా పోసుకొని బాగా కాలాక తీసుకోవాలి. లేదా మిర్చి, జీలకర్రా వేరే ప్లేట్‌లో ఉంచుకొని అట్టు పోసిన తరువాత దానిమీద కాస్త కాస్తగా అద్దుకున్నా బాగానే వుంటాయి.


[ వెనుకకు ]


మూలం : అన్నపూర్ణ వంటలు, పిండి వంటలు పుస్తకములోనివి.


సేమ్యా పాయసం

కావలసిన వస్తువులు:

పాలు - ఒక లీటరు.
సేమ్యా - ఒక కప్పు.
సన్నటి సగ్గు బియ్యం - అర కప్పు.
పంచదార - సరిపడినంత.
యాలుకల పొడి - రెండు టీ స్పూన్లు.
పచ్చి కోవా - 50 గ్రాములు.
బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు - కావలసినన్ని.
నెయ్యి - ఆరు టీ స్పూన్లు.

తయారు చేసే విధానం:

మూకుడులో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత దాంట్లో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ మూకుడులో మరో రెండు స్పూన్ల నెయ్యి వేసి సేమ్యాను దోరగా వేయించాలి. కాపర్ బాటం గిన్నెలో పాలు బాగా మరిగించాలి. దాంట్లో సన్నటి సగ్గుబియ్యం, (సగ్గు బియ్యంలో కొంచెం నీళ్ళు పోసి కలిపి పాలల్లో వేస్తే ఉండకట్టకుండా ఉంటాయి) సేమ్యా వేసి బాగా కలపాలి. సగ్గుబియ్యం, సేమ్యా బాగా ఉడికే వరకు సన్నటి సెగపై ఉడికించాలి. తర్వాత దాంట్లో పంచదార, పచ్చి కోవా, నెయ్యి వేసి బాగా కలపాలి. పంచదార బాగా కరిగిన తరువాత పొయ్యి మీద నుండి దించాలి. దాంట్లో పచ్చకర్పూరం (ఆ వాసన ఇష్టమైన వారు) వేసి కలపండి. తయారైన సేమ్యా పాయాసంలో పైన వేయించిన పప్పులను అందంగా అలంకరించండి.(దీన్ని కోవా లేకుండా అయిన చేసుకోవచ్చు).


[ వెనుకకు ]


బేసన్ లడ్డు

కావలసిన వస్తువులు:

శనగపిండి - 600 గ్రా.
నెయ్యి - 500 గ్రా.
పంచదార - 300 గ్రా.
యాలుకలపొడి - 10 గ్రా.

తయారు చేసే విధానం:

శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని చక్కగా కలిపి సన్నటి సెగపై దోరగా వేయించి పెట్టుకోవాలి. గిన్నెలో పంచదారకు సరిపడినన్ని నీళ్ళు పోసి ముదురు పాకం పెట్టుకోవాలి. యాలకుల పొడివేసి కలిపి చల్లార్చిన తర్వాత పంచదార పాకం పొడి అయ్యేదాకా కలపాలి. శనగపిండి మిశ్రమాన్ని వేసి కలిపి కావల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి.


[ వెనుకకు ]


ఇడ్లీ

కావలసిన వస్తువులు:

మినపప్పు - 1 గ్లాసు.
ఉప్పుడురవ్వ - 2 గ్లాసులు.
ఉప్పు - తగినంత.
సోడాఉప్పు - చిటికెడు.

తయారు చేసే విధానం:

మినపప్పులో నీళ్ళు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తరువాత పొట్టుతీసి శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పుడురవ్వను 3, 4 సార్లు కడుక్కొని నీళ్ళు వంచేసి గట్టిగాపిండుకొని, రుబ్బిన పిండిలో, ఉప్పు, రవ్వ వేసి కలుపుకోవాలి. రేపు ఇడ్లీలు వేస్తామనగా ఈ రోజు పిండి కలుపుకొని ఉంచుకోవాలి. ఇడ్లీలు వేసే ముందు సోడాఉప్పు కలుపి వేసుకొంటే ఇడ్లీలు బాగుంటాయి.


[ ఇడ్లీ చరిత్ర ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: